మోదీ ఓ ఫూల్‌!

– కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విరుచుకుపడ్డారు. లక్షిత దాడులు (సర్జికల్‌ స్టైక్స్‌) చేసిన ఘనత తనదేనని మోదీ చెప్పుకోవడంపై ఘాటుగా విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..  సర్జికల్‌ స్టైక్స్‌ ఘనత తనదేనని చెప్పుకుంటున్న మోదీ ఓ ఫూల్‌ అని వ్యాఖ్యానించారు. ఆయన (మోదీ) ఓ ఫూల్‌. సర్జికల్‌ స్టైక్స్‌ వల్ల రాజకీయ ప్రయోజనం పొందడం చాలా పెద్ద పొరపాటని సిద్ధిరామయ్య అన్నారు. మన సైన్యం సర్జికల్‌ స్టైక్స్‌ చేసిందని, మోదీ కనీసం ఓ తుపాకీ అయినా పట్టుకున్నారా అని ప్రశ్నించారు. దాని ఘనత తనదేనని ఎందుకు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అంతకుముందు ముఖ్యమంత్రి కుమార స్వామి కూడా మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ తన పదవిని దుర్వినియోగపరచడం తప్పు అన్నారు. మన దేశంలో చాలామంది ప్రధాన మంత్రులు వచ్చారని, భారత్‌ – పాక్‌ మధ్య యుద్ధం చాలాసార్లు జరిగిందని, కానీ ఎవరూ వాటి వల్ల వ్యక్తిగత ప్రయోజనం పొందలేదని చెప్పారు.