యూపిలో పట్టాలు తప్పిన పూర్వా ఎక్స్‌ప్రెస్‌

13 మందికి తీవ్ర గాయాలు….రాకపోకలకు అంతరాయం
లక్నో,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  యుపిలో శనివారం తెల్లవారుజామున ఓ రైలు పట్టాలు తప్పింది. హౌరా నుంచి ఢిల్లీ వెళ్తున్న పూర్వా ఎక్స్‌ప్రెస్‌ రైలు  కాన్పూర్‌లోని రూమా గ్రామం వద్ద పట్టాలు తప్పడంతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.  ఈ ప్రమాదంలో 12 బోగీలు పట్టాలు తప్పాయి. నాలుగు బోగీలు పూర్తిగా బోల్తా కొట్టయి.  ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను వారివారి  గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేశారు. గాయపడిన వారి వివరాలు తెలుసుకునేందుకు  ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు.  ప్రధాన మార్గంలో రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల  రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పునరుద్దరణ పనులు చేపట్టారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు.