రాజస్థాన్లో కుప్పకూలిన మిగ్ 27విమానం
– సురక్షితంగా బయటపడ్డ పైలట్
న్యూఢిల్లీ, సెప్టెంబర్4(జనం సాక్షి) : భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 27 విమానం రాజస్థాన్లోని జోధ్పూర్లోని బనాద్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం నేలకూలిన అనంతరం మంటలు చెలరేగి పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రోజువారీ విధుల్లో భాగంగా గాల్లోచక్కర్లు కొడుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని వైమానికదళ అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తీరుపట్ల విచారణకు ఆదేశించారు. ఇటీవలే భారత్లో మిగ్ 27ఎంఎల్ స్వ్కాడ్రన్ విమానాలను వాడటం మానేసిన తరువాత స్వల్పమార్పులతో మిగ్ 27 విమానాలను జోధ్పూర్లో వాడుతున్నారు. జూన్ 8న భారత వైమానిక దళం జాగ్వార్ అభివృద్ధి చేసిన విమానం కిందికి దిగుతుండగా ప్రమాదం సంభవించింది. జామనగర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఇద్దరు పైలట్లు శిక్షణలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంతకుముందు జూన్ 5న గుజరాత్లోని ముంద్రా తాలుకానూ జాగ్వార్ విమానం కుప్పకూలడంతో వైమానిక దళ కమాండర్ సంజయ్ చౌహాన్ మృతిచెందాడు. వీటికంటే ముందు మే23న జమ్ముకశ్మీర్లో వైమానిక దళ హెలికాప్టర్ ‘చీతా’ కుప్పకూలింది. దీంతో కోర్టు విచారణకు ఆదేశించింది. మార్చి20న జార్ఘండ్, ఒడిశా సరిహద్దులోని సుబర్ణరేఖ నది వద్ద అడ్వాన్స్ హక్ జెన్ కుప్పకూలింది.
—————————-