రాజ్‌కపూర్‌కు సతీవియోగం

– కృష్ణారాజ్‌కపూర్‌ కన్నుమూత
– అనారోగ్యంతో బాధపడుతూ మృతి
న్యూఢిల్లీ, అక్టోబర్‌1(జ‌నంసాక్షి) : అలనాటి బాలీవుడ్‌ దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్‌కపూర్‌ సతీమణి కృష్ణా రాజ్‌కపూర్‌ (87) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజ్‌కపూర్‌ మనవరాలు రిధిమా కపూర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘మిమ్మల్ని ఎప్పుడూ మిస్సవుతూనే ఉంటాం నానమ్మా. ఐలవ్యూ’ అని క్యాప్షన్‌ ఇస్తూ ఆమెతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. ఇటీవలే తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లొచ్చిన కృష్ణా రాజ్‌కపూర్‌ ఇంతలోనే ఆమె అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కపూర్‌ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు రాజ్‌కపూర్‌ కుమారుడు రిషికపూర్‌ ఆరోగ్య పరీక్షల కోసం శనివారమే అమెరికాకు వెళ్లారు. తల్లి మరణవార్త తెలుసుకున్న రిషి సోమవారం సాయంత్రం ముంబయికి చేరుకున్నారు. రిషికపూర్‌ భారత్‌ చేరుకున్న తర్వాతే ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు. చెంబూరు శ్మశానవాటికలో అంత్యక్రియలు
నిర్వహించనున్నట్టు తనయుడు రణధీర్‌ కపూర్‌ వెల్లడించారు. రాజ్‌కపూర్‌ను 1946 మేలో వివాహం చేసుకున్నకృష్ణా రాజ్‌కపూర్‌ దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో ముగ్గురు అబ్బాయిలు, కాగా ఇద్దరు అమ్మాయిలు. రణధీర్‌ కపూర్‌, రిషి కపూర్‌, రాజీవ్‌ కపూర్‌, ఇద్దరు కుమార్తెలు రీతు, రీమా కపూర్‌లు. కృష్ణా రాజ్‌కపూర్‌ మృతిపట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌, రవీనా టాండన్‌, సోహా అలీఖాన్‌, సోఫీ చౌదరి, దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ తదితరులు ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు.