రాహుల్‌తో తుమ్మల భేటి

దిల్లీ (జనంసాక్షి): ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. కేసీ వేణుగోపాల్‌ పిలుపు మేరకు దిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో తుమ్మల భేటీ అయ్యారు.పార్టీలో చేరిన తర్వాత ఆయన రాహుల్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి. పార్టీలో చేరిన రోజు సమయం ఇవ్వలేక పోవడంతో.. అధిష్ఠానం తుమ్మలను పిలిపించినట్లు సమాచారం. ఈ క్రమంలో సుమారు అరగంట పాటు రాహుల్‌ గాంధీతో తుమ్మల భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు కీలక చర్చలు జరిపారు. ఖమ్మం జిల్లాలో పరిస్థితులు, రాజకీయ వ్యూహంపై కూడా చర్చించారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్లు సమాచారం.