రిషబ్‌ పంత్‌ను గుర్తించరా

బిసిసిపై నెటిజన్ల ఆగ్రహం
న్యూఢిల్లీ,మే11(జ‌నం సాక్షి ):  ఐపీఎల్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌. ఈ యువ వికెట్‌ కీపర్‌ సృష్టించిన పరుగుల సునావిూలో ఫిరోజ్‌ షా కోట్లా తడిసి ముద్దయింది. కేవలం 63 బంతుల్లోనే 128 పరుగులు చేశాడు. అదీ ఈ సీజన్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ యూనిట్‌ ఉందని భావిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌పై. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు సాధించిన ఇండియన్‌ బ్యాట్స్‌మన్‌గా పంత్‌ రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఈ లీగ్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయసు బ్యాట్స్‌మన్‌. ఈ సీజన్‌లో 11 మ్యాచుల్లో 521 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ కూడా ఇప్పుడు అతని దగ్గరే ఉంది. దీంతో పంత్‌పై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురుస్తున్నది. అదే సమయంలో అతన్ని టీమిండియా టీ20 టీమ్‌కు ఎంపిక చేయని సెలక్టర్లపై దుమ్మెత్తిపోశారు. ఈ ఇన్నింగ్స్‌ సెలక్టర్లకు ఓ చెంప దెబ్బలాంటిదని నెటిజన్లు అంటున్నారు. ఈ మధ్యే ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌లతో జరిగే టీ20 సిరీస్‌లకు టీమ్‌ను ఎంపిక చేసినా.. అందులో రిషబ్‌ పంత్‌కు స్థానం కల్పించలేదు.