రైతుబంధు పథకం భేషని తేలింది
లోక్సభలో ఎంపి జితేందర్ రెడ్డి
న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జనంసాక్షి): సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు స్కీమ్ అద్భుతమైందని, తమ పార్టీ మళ్లీ విజయకేతనం ఎగురవేయడంలో ఆ స్కీమ్ కీలకంగా నిలిచిందని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి లోక్సభలో అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలు రెండు పాఠాలు నేర్పాయన్నారు. రైతులను విస్మరించరాదు అన్న విషయాన్ని తేల్చాయన్నారు. రైతు రుణాలను మాఫీ చేయాలన్నది కూడా అత్యవసరమని స్పష్టం చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కన్నా ఎక్కువగా రైతు బంధు పథకం కింద రైతులకు పంట సాయం చేస్తున్నామన్నారు. కేసీఆర్ సర్కార్ భారీ ఎత్తున్న నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని ఎంపీ జితేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ కేంద్ర బ్జడెట్లో ఆ ప్రాజెక్టుకు నిధులు దక్కలేదన్నారు. డబ్లింగ్, బ్రిడ్జ్ నిర్మాణం కోసం దక్షిణ మధ్య రైల్వేకు నిధులు కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు. వరంగల్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నదని, ఈ వర్సిటీ కోసం కేటాయింపులను తగ్గించారన్నారు. తెలంగాణలో మరిన్ని ఉన్నత విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రధాని మోదీయే ఈ మాట అన్నారని టీఆర్ఎస్ ఎంపీ తెలిపారు.