రైతులేవ్వరూ అధైర్య పడొద్దు, రానున్నది రైతు ప్రభుత్వం : చెఱకు శ్రీనివాస్ రెడ్డి.
దౌల్తాబాద్ ఆగష్టు 26, జనం సాక్షి.
• సీఎం కేసిఆర్ కు పంజాబ్ రైతులపై ఉన్న ప్రేమ సొంత జిల్లా రైతులపై లేదు.
అప్పుల బాధ, రుణమాఫీలో జాప్యం వంటి కారణాలతో జరుగుతున్న రైతుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెఱకు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామంలో బుదవారం అప్పుల బాధతో రైతు కాళ్ళు,చేతులు కట్టేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకొని శుక్రవారం ఆ రైతు కుటుంబాన్ని చెఱకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసారు. మీడియాతో మాట్లాడుతూ పంజాబ్ రైతులకు ఏ విధంగానైతే 2లక్షల ఆర్థిక సహాయం అందించారో అదే విధంగా ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అప్పుల బాధలతో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, కుటుంబ పెద్దలను కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అని మండిపడ్డారు.
వ్యవసాయాన్ని పండుగలా, రైతులను రాజులుగా చేస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ రైతు రుణ మాఫీ చేయకపోవడంతో అప్పుల బాధలతో రైతులు అర్ధాంతరంగా ఆయుష్షు ముగిస్తున్నారని, రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
అనంతరం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పూసల నరేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసారు. అనంతరం దొమ్మాట, మహ్మద్ షాపూర్ గ్రామాల్లో వివిధ కారణాలతో మరణించిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గొడుగుపల్లి మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి,బండారు,లాలూ, ప్రవీణ్,యాదవ రెడ్డి,స్వామి తదితరులు పాల్గొన్నారు.
