రైల్లోంచి కిందకు దూకిన మహిళప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ

కోల్‌కతా,డిసెంబర్‌3(జనంసాక్షి): వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి ఓ మహిళా ప్రయాణికురాలు ప్లాట్‌ఫామ్‌పైకి దూకింది. దీంతో ఆమె ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోయింది. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆమె ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన బెంగాల్‌లోని పురులియా స్టేషన్‌లో చోటు చేసుకుంది. సంత్రగచ్చి ఆనంద్‌ విహార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ఇద్దరు మహిళా ప్రయాణికులు ఎక్కారు. అయితే ఆ మహిళలకు సంబంధించిన వారు రైలు ఎక్కలేదు. అప్పటికే రైలు కదిలింది. తమ వారు రైలు ఎక్కలేదనే ఉద్దేశంతో.. వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి మొదట ఒకావిడ కిందకు దూకింది. అంతలోనే మరో మహిళ కూడా కిందకు దూకడంతో.. ఆమె ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోయింది. అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బబ్లూ కుమార్‌ పరుగెత్తి.. ఆ మహిళా ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడారు. మహిళ ప్రాణాలు కాపాడిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు.