లఖీంపూర్‌ ఖేరీ ఘటనపై సుప్రీంలో విచారణ

తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా
న్యూఢల్లీి,అక్టోబర్‌20 ( జనం సాక్షి ): ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ ఘటనపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం తరపున హరీష్‌ సాల్వే.. ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ?కాగా, ఘటన తర్వాత తీసుకున్న చర్యలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్‌ చేశారని సుప్రీంకోర్టు హరిష్‌ సాల్వేని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా.. నలుగురిని అరెస్ట్‌ చేశామని యూపీ అడ్వకేట్‌ జనరల్‌ హరీష్‌ సాల్వే తెలిపారు. ఘటనకు సంబంధించిన దర్యాప్తు నివేదికను సీల్డుకవర్‌లో ధర్మాసనం ముందు ఉంచామని హరిష్‌ సాల్వే తెలిపారు. మరికొన్ని వీడియోలున్నాయని, అవి దర్యాప్తునకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ సూర్యకాంత్‌.. నివేదికను సీల్డుకవర్‌లో ఇవ్వాలని తాము కోరలేదని స్పష్టం చేశారు. నిన్న రాత్రి 1 గంట వరకు ఎలాంటి నివేదిక అందలేదని సుప్రీంకోర్టు జస్టిస్‌ రమణ తెలిపారు. కాగా, తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదావేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.