లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ కీలకపాత్ర

` మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్‌(జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని ఆయన చెప్పారు. ఆదివారం ఇందిరాపార్క్‌ వద్ద జరిగిన మాదిగల యుద్ధభేరి సభలో హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదిగలపై ప్రధాని మోదీకి చిత్తశుద్ది లేదని మంత్రి విమర్శించారు.ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న మోదీ ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ఏర్పాటయ్యాక అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని చెప్పారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లుగా ఎస్సీ వర్గీకరణపై తాత్సారం చేస్తోందని అన్నారు.మాదిగలపై ప్రధాని మోదీకి చిత్తశుద్ది లేదని, ఎస్సీ వర్గీకరణపై సీఎం కేసీఆర్‌ ఎన్నోసార్లు అడిగినా మోదీ పట్టించుకోవడం లేదని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ రాష్ట్రంలో 33 దళిత స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎస్సీల్లో అర్హులకు రూ.10 లక్షలిచ్చి సాయం చేయాలనే ఉద్దేశంతోనే దళితబంధు పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.