వచ్చే పదిహేనేళ్లలో..
100ఎయిర్పోర్టులు నిర్మిస్తాం
– విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు
న్యూఢిల్లీ, సెప్టెంబర్4(జనం సాక్షి) : వచ్చే 10-15 పదిహేనేళ్లలో దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాలను నూతనంగా నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా 60 బిలియన్ డాలర్లతో(రూ. 4.2లక్షల కోట్లు) వీటిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు కార్గో పాలసీపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు తెలిపారు. దేశంలో విమాన ప్రయాణీకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో పౌరవిమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత 50 నెలలుగా దేశంలో విమాన ప్రయాణీకుల సంఖ్య రెండంకెల వృద్ధి సాధిస్తూ వస్తోంది. అంతర్జాతీయ ఎయిర్లైన్స్ బృందం ఐఏటీఏ(ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) డేటా ప్రకారం.. రానున్న పదేళ్లలో జర్మనీ, జపాన్, స్పెయిన్, యూకేను దాటి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎయిర్ ప్యాసింజర్ మార్కెట్గా అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు.