వరంగల్‌ జిల్లాలో పైశాచికం… వివస్త్రను చేసి వూరేగించారు

వరంగల్‌ జిల్లా వర్థన్నపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. బీసీ తండాకు చెందిన రవి అనే వ్యక్తి రెండో భార్య అనితపై మొదటి భార్య బంధువులు పైశాచికంగా దాడి చేశారు. వివరాల్లోకి వెళితే… 2009లో రవి అదే తండాకు చెందిన స్వరూపను వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కొంతకాలానికి రవి, తన భార్య స్వరూపపై అయిష్టంతో అదే తండాకు చెందిన అనిత అనే అమ్మాయిని 2015లో వివాహం చేసుకుని వరంగల్‌లోని ఖాజీపేటలో కాపురం పెట్టాడు.

ఈ క్రమంలో అనిత గర్భం దాల్చడంతో ఆమెను నెల కిందట బీసీ తండాకు తీసుకువచ్చాడు. దీంతో భార్య స్వరూప బంధువులకు, రెండో భార్య అనిత కుటుంబీకులకు మధ్య కొంత కాలంగా పంచాయతీలు జరుగుతున్నాయి. కాగా సోమవారం ఉదయం ఏడుగంటల సమయంలో స్వరూప బంధువులు అనిత ఇంటిపై దాడి చేశారు. ఆమెను వివస్త్రను చేసి కర్రలు, ఇనుప కడ్డీలను కాల్చి వాతలు పెట్టి వీధుల్లో తిప్పారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అనితను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానికంగా విచారిస్తున్నారు.