వారి అసలు పేర్లు బయటపెట్టాలి
– యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్
లక్నో, ఏప్రిల్22(జనంసాక్షి) : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ‘నకిలీ పేరు’తో ప్రజలను మోసం చేస్తున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. సోమవారం యూపీలోని ఘటంపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో యోగి మాట్లాడుతూ… ‘వంశపారంపర్యంగా రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీ అసలు పేరు రాహుల్ గాంధీ కాదన్నారు. బ్రిటన్, ఇటలీ దేశాల్లో రాహుల్ పేరు ‘రావుల్ విన్సీ’గా చలామణీ అవుతోందని పేర్కొన్నారు. ఈపేరుతో ఆయన దేశాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆయన అసలు పేరు రావుల్ విన్సీ అని, కాంగ్రెస్ కూడా దేశాన్ని మోసం చేస్తూ ఈ పాపం చేయడం నాకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు. రాహుల్, ప్రియాంకల అసలు పేర్లు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందనీ.. ఆయన నామినేషన్ తిరస్కరించాలంటూ అమేథీ బీజేపీ అభ్యర్థి ధ్రువ్ లాల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ‘రావుల్ విన్సీ’ పేరుతో యూకేలో ఓ కంపెనీ రిజిస్టర్ అయి ఉందనీ.. రాహుల్ దాన్ని తన అఫిడవిట్లో ప్రస్తావించలేదని లాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈసీ రాహుల్ నామినేషన్ను సోమవారం ఆమోదం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.