విగ్రహాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న భారత్‌

మండిపడ్డ బ్రిటన్‌ ఎంపి

లండన్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): అప్పులు తీసుకుంటూ అభివృద్దిని పక్కన పెట్టి, విగ్రహాలు నిర్మించడం ఏంటని బ్రిటన్‌ ఎంపి ఒకరు మండిపడ్డారు. ఆ మాత్రం దానికి తామెందుకు రుణం ఇవ్వాలని కూడా

ప్రకటించారు. భారత్‌ ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్దార్‌ పటేల్‌ విగ్రహం నిర్మంచడాన్ని ఓ చెత్తపని అని బ్రిటన్‌కు చెందిన ఆ ఎంపీ తప్పుపట్టారు. ఒక పక్క తమ నుంచి రూ.9,492 కోట్లను ఆర్థిక సాయం రూపంలో భారత్‌ తీసుకొందని.. అదే సమయంలో దాదాపు రూ.3వేల కోట్లు వెచ్చించి ఆ భారీ విగ్రహాన్ని నిర్మించిందని కన్జర్వేటీవ్‌ పార్టీ ఎంపీ పీటర్‌ బోన్‌ విమర్శించారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. తాము ఐదేళ్లలో భారత్‌కు పలు ప్రత్యేక ప్రాజెక్టుల కోసం నిధులను అందజేశామని తెలిపారు. మహిళల హక్కులకు సంబంధించి, పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రాజెక్టులు, మతపరమైన సహనం పెంపొందించడానికి ఈ నిధులను సాయం రూపంలో అందించామన్నారు. ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ వంటి ప్రాజెక్టులకు భారత్‌ వేలకోట్ల రూపాయలు వెచ్చించగలుగుతున్నప్పుడు ఇక తాము సాయం చేయాల్సిన అవసరం లేదన్నారు. మరికొందరు ఎంపీలు కూడా పీటర్‌ అభిప్రాయంతో ఏకీభవించారు. కొన్నేళ్లుగా యుకే భారత్‌లోని వివిధ పథకాలకు ఆర్థిక సాయం అందజేస్తోంది. 2012లో 300 మిలియన్‌ పౌండ్లు, 2013లో 268 మిలియన్‌ పౌండ్లు, 2014లో 278 మిలియన్‌ పౌండ్లు, 2015లో 185 మిలియన్‌ పౌండ్లు అందజేసింది. ఇదే సమయంలో భారత్‌లో భారీ పటేల్‌ విగ్రహ నిర్మాణం ప్రారంభమైంది. వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో భారత్‌కు ఆర్థిక సాయం ఆపేయాలని బ్రిటన్‌లోని పలు వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.