విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్‌ ఇప్పించండి

అప్జల్‌గురు తనయుడు గాలిబ్‌ వినతి
న్యూఢిల్లీ,మార్చి5(జ‌నంసాక్షి):  2001లో పార్లమెంట్‌పై దాడి సూత్రధారి అప్జల్‌ గురు  తనయుడు ఇప్పుడు ఇండియన్‌ పాస్‌పోర్టు కోసం ఎదురు చూస్తున్నాడు. తాను విదేశాల్లో చదువుకోవడానికి పాస్‌పోర్ట్‌ మంజూరు చేయాలని కోరుతున్నాడు.  2013లో భారత ప్రభుత్వం అఫ్జల్‌ను ఉరి తీసింది. ఇప్పుడతని కొడుకు గాలిబ్‌ గురు ఆధార్‌ కార్డు సంపాదించాడు. తనకు ఈ గుర్తింపు కార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, అయితే పాస్‌పోర్ట్‌కు కూడా ఇప్పిస్తే విదేశాలకు వెళ్లి చదువుకుంటానని చెబుతున్నాడు. ఇప్పటికే తనకు ఇటలీ నుంచి స్కాలర్‌షిప్‌ ఆఫర్‌ కూడా వచ్చిందని అన్నాడు. తనకు పాస్‌పోర్ట్‌ కూడా దక్కితే ఓ భారతీయ పౌరుడిగా తాను చాలా గర్విస్తానని గాలిబ్‌ చెప్పాడు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించిన ఓ పత్రికపైనా గాలిబ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు పాస్‌పోర్ట్‌ ఇస్తేనే భారతీయుడిగా గర్విస్తానని సదరు పత్రిక రాసిందని, తన ఉద్దేశం మాత్రం అది కాదని అతను అన్నాడు.