విమర్శలు కాదు..హావిూల కోసం పట్టుపట్టండి

చంద్రబాబు డైరెక్షన్‌లో మాట్లాడడం మానండి
బిజెపి నేతలకు మంత్రి వెల్లంపల్లి చుర

విజయవాడ,ఫిబ్రవరి2జనం సాక్షి): బిజెపి నేతలు సొంతంగా ఆలోచించడం, సొంతంగా మాట్లాడడం మరచిపోయారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో బీజేపీ నేతలు నడుస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు పెట్టుబడిదారులైన సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఏపీ బీజేపీలో పని చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ లు పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే చదివేవారు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ నేతలు తోడయ్యారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా, పోలవరానికి నిధులు, కడపకు స్టీల్‌ ప్లాంట్‌, రైల్వేజోన్‌ ఇస్తామని చెప్పే సత్తా సోము వీర్రాజు, జీవీఎల్‌కు ఉందా అని ప్రశ్నించారు. వీరు ఎపి నేతలు కారా అని అన్నారు. దమ్ముంటే వీటి గురించి కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. ఎపికి సహకరించే పనులు చేయాలని, విమర్శించే పనులు పక్కన పెట్టాలని అన్నారు. బీజేపీ నేతలు కపట నాటకాలు ఆడుతున్నారని మంత్రి వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. ఏపీ అభివృద్ధికి సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని.. ఇలాంటి వారు ఎంతమంది అడ్డుపడినా సీఎం జగన్‌ ఏపీని అభివృద్ధి చేసి తీరతారన్నారు. చంద్రబాబు ఇచ్చిన కాగితాలు చదవొద్దని ఏపీ బీజేపీ నేతలకు మంత్రి హితవు పలికారు. చంద్రబాబు డైరెక్షన్‌లో ఇలాగే కొనసాగితే బీజేపీ మరింత హీనంగా తయారవుతుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. ప్రజలు ఇప్పటికే వారిని నమ్మడం లేదన్నారు. ఎపికి అన్యాయం జరుగుతంటే విమర్శలు చేయడం మాని..సహాయం చేసే పనిలోపడాలన్నారు. కేంద్రాన్ని ఒప్పించి నిధులు తేవాలన్నారు. ఇచ్చిన విబజన హావిూలు పూర్తి చేయించాలన్నారు.