విమర్శలు మాని వర్గీకరణపై మాట్లాడాలి : మందకృష్ణ
వరంగల్,ఫిబ్రవరి16(జనంసాక్షి ): తమను విమర్శించేందుకు టిడిపి నేతలు వర్గీకరణపై ఎందుకు మాట్లాడడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎర్రబెల్లి దయాకర్రావు వంటి నేతలు ఎస్సీ వర్గీకరణపై మాట్లాడాలన్నారు. గతంలో తీర్మానం చేశామంటున్న వారు ఇప్పుఉడ ఎందుకు చేయడం లేదన్నారు. ఎపి అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు పాస్ చేయించి చిత్తశుద్ది చాటుకోవాలన్నారు. రెండు రాష్టాల్ర మాదిగలు ఇకపై టిడిపి ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా నిరసనలు తెలుపుతామన్నారు. వెంటనే ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబుతో పాటు తెలంగాణ టిడిపి నాయకులు తమ విధానాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల వరంగల్లో జరిగిన టిడిపి సమావేశంలో ఆపార్టీ నేతలు ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడం దురదృష్టకరమని వరంగల్, నల్లొగండ పర్యటనల్లో ఆయన పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత ఎస్సీ వర్గీకరణ అనుకూలమనిహావిూలిచ్చి, అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని, పార్లమెంట్లో చట్టబద్ధతకు కృషి చేస్తానని ఎన్నికల ముందు హావిూలు ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాటిని మరిచి మాదిగలను వంచిస్తున్నాడని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మాదిగల రుణం తీర్చుకుని కంటికి రెప్పలా చూసుకొంటానని పేర్కొన్న బాబు ఏపీ అసెంబ్లీలో తీర్మానం పెట్టలేదని, వర్గీకరణకు కృషిచేయకుండా మోసం చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు తెలంగాణలో, ఏపీలలో ఎక్కడ పర్యటించినా అడ్డుకుని తీరుతామని మందకృష్ణ హెచ్చరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిగలపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని, అవినీతి విషయానికి వస్తే ఆయన అందరికంటే ఎక్కువ తిన్నాడని విమర్శించారు. రాజయ్య తనశాఖ విషయాలపై స్వతంత్యంగా వ్యవహరించినందుననే పదవినుంచి తొలగించారని ఆరోపించారు.