వివాహేతర సంబంధాలు: 497పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

దిల్లీ: ఇష్టపూర్వకంగా కొనసాగే వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించలేమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 పురాతన చట్టమని.. రాజ్యాంగ సమ్మతమైనది కాదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. సెక్షన్‌ 497 కాలం చెల్లిన చట్టంగా పేర్కొంది. మహిళలకు సమానహక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్‌ 497తో తూట్లు పడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. మహిళల సమానత్వానికి అడ్డుపడే ఏ నిబంధన అయినా రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది. వివాహమైతే పురుషులు భార్యలను తమ ఆస్తిగా భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే వివాహేతర సంబంధాల కారణంతో విడాకులు తీసుకోవచ్చని, దాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టంచేసింది.

వివాహేతర సంబంధాల చట్టంలోని పలు నిబంధనలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే కేంద్రం చట్టాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించింది. వివాహేతర సంబంధం నేరంగా పరిగణిస్తేనే వివాహ పవిత్రతకు రక్షణ ఉంటుందని వాదించింది. అయితే కోర్టు ఆ వాదనతో అంగీకరించలేదు. ఇష్టపూర్వక శృంగారం నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేసింది. సెక్షన్‌ 497 పురాతన చట్టమని తెలిపింది. చాలా దేశాలు ఈ తరహా చట్టాలను తొలగించాయని కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది.

ఒకరు ఎవరితో శృంగారం చేయాలి.. ఎవరితో చేయకూడదు అనే విషయాన్ని మరో వ్యక్తి నిర్ణయించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మహిళ తనకు ఇష్టం ఉన్నవారితో గడిపితే నేరంగా భావించలేదని పేర్కొంది. వివాహం కాగానే భార్య తన ఆస్తిగా భర్త పరిగణించడం సరికాదని పేర్కొంది. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలు, కేసులను దృష్టిలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇష్టపూర్వకంగా కొనసాగే వివాహేతర సంబంధాలపైనా కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.