వృద్ధ దంపతుల దారుణహత్య

కారపు పొడి చల్లి తలపై మోది హత్య
దోపిడీ దొంగల పనేనా?
విచారణ చేపట్టిన పోలీసులు
హసన్‌పర్తి, జూన్‌19(జ‌నం సాక్షి) : వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తిలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కారపు పొడి చల్లి తలపై బాది గొంతు కోసి కిరాతకంగా ప్రాణాలు తీశారు. హసన్‌పర్తి ప్రధాన రహదారి పక్కనే ఉన్న గడ్డం దామోదర్‌(65), గడ్డం పద్మ(55) దంపతులు స్ధానికంగా కిరాణా దుకాణం నడుపుతున్నారు. రోజులా దంపతులిద్దరూ దుకాణం తెరవకపోవడం, తలుపులు కూడా మూసి ఉండటంతో పక్కనే ఉన్న ¬టల్‌ నిర్వాహకురాలు అనుమానం వచ్చి ఇంట్లోకెళ్లి చూసింది. దీంతో ఇంట్లో దంపతులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉంటాన్ని చూసిన  ¬టల్‌ నిర్వాహకురాలు భయంతో చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా సామానంతా చిందర వందరగా ఉంది. బంగారం కూడా పోయినట్లు గుర్తించారు. సొమ్ము కోసమే ఈ జంట హత్యలు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే నగర సీపీ రవీందర్‌, ఇతర అధికారులు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీం, జాగిలాలను రప్పించి నిందితుల ఆచూకి కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. దామోదర్‌ను ఇంట్లోనే హత్య చేయగా…. పద్మను ఇంటి ముందున్న బాతురూమ్‌లో అతి దారుణంగా గొంతు కోసి చంపారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా ఆనవాళ్లు కనపడుతున్నాయి. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంఘటన హసన్‌పర్తిలో కలకలం రేపింది.