శిఖం భూముల్లో కబ్జా

తొలగిస్తామంటున్న అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం,మే16(జ‌నం సాక్షి): సత్తుపల్లిలో దాని పరిసిర ప్రాంతాల్లో చెరువుల అభివృద్ధికి మిషన్‌ కాకతీయలో భాగంగా పనులు సాగుతున్నాయి. అయితే ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలను పరిశీలించి అలాంటివి ఉంటే తొలగిస్తామని అధికారులు అన్నారు. త్వరలో పనులు ప్రారంభించడంతో పాటు చెరువు స్థలంలో ఆక్రమణలను కూడా తొలగించి సరిహద్దులు నిర్ణయిస్తామన్నారు.చెరువు ముంపులో పంటలు సాగు చేయవద్దని గతంలో పలుమార్లు తెలియజేశాం. నీళ్లు ఈ చెరువులోకి రాకుండా చేసిన వారిపై కేసు పెట్టామన్నారు. సత్తుపల్లి పట్టణ జనాభా పెరగటంతో నివాస స్థలాలకు డిమాండ్‌ ఏర్పడింది. జంగాలకాలనీ, జవహర్‌నగర్‌లను ఆనుకొని ఉన్న చాకలికుంట ముంపు భూమిపై ఆక్రమణదారుల కన్నుపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ చెరువు శిఖం, దాని సవిూపంలోని అసైన్‌మెంట్‌ భూములను దళారులు
ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చెరువు ముందు భాగంలో కొంత స్థలాన్ని ఆక్రమించి ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఆక్రమణకు గురికాకముందు ఈ చెరువులో ఏడాది పొడవునా నీళ్లు నిల్వ ఉండడం వల్ల పశువుల దాహార్తి తీరేది. సవిూపంలో అడవి ఉండటంతో వణ్యప్రాణులు సైతం వేసవిలో ఇక్కడకు వచ్చి దాహార్తిని తీర్చుకునేవి.   ఇక్కడ నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రదేశంలో భూగర్భజలం సమృద్ధిగా ఉండేది. చెరువు ఆక్రమణకు గురైన తర్వాత ఆ పరిస్థితులు లేవు.  పట్టణంలో జనాభా పెరిగిన నేపథ్యంలో జంగాలనీలోని భూమి ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కొందరు పోటీలు పడి ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. వారిలో కొందరు ఈ చెరువు ముంపు స్థలాన్ని కాజేసి చుట్టూ రాళ్లు పాతి ఇనుప కంచె ఏర్పాటు చేశారు. విషయం తెలిసి రెవెన్యూ సిబ్బంది హెచ్చరించడంతో ఆక్రమణదారులు ఆ స్థలంలో ఏర్పాటు చేసిన కంచెను కొంతమేర తొలగించారు. ఆక్రమణదారులు వరదనీళ్లతోపాటు ఎన్టీఆర్‌ కాలువ నీళ్లు ఈ చెరువులోకి రాకుండా చేశారు. దీంతో ఆయకట్టు భూములకు నీళ్లందక మా పంటలు ఎండిపోతున్నాయి.