శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– పౌరుడు, సైనికుడి, ఉగ్రవాది మృతి
శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం జరిగిన ఎన్‌కౌంటర్లలో ఓ పౌరుడు, సైనికుడు మృతిచెందగా.. కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అనంతనాగ్‌ జిల్లాలోని దూరు ప్రాంతంలో జరిగిన గురువారం  తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది చనిపోయినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది నవీబ్‌ జాట్‌ అలియాస్‌ హంజ్లా భద్రతా బలగాల చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌ వ్యాప్తంగా ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య గురువారం ఉదయం మూడు ఎన్‌కౌంటర్లు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతనాగ్‌ జిల్లాలో, శ్రీనగర్‌ శివారులోని నూర్‌బాగ్‌ ప్రాంతంలో, బుద్గాంలోని చదూరా టౌన్‌లో ఎన్‌కౌంటర్లు జరిగాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్‌ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు.