సంచార జాతులు తల్చుకుంటే రాజ్యాలే మారతాయి
– చీటకోడూరు సంచార జాతులతో రచ్చబండలో బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
జనగామ (జనం సాక్షి )ఆగస్ట్19:సంచార జాతులు తల్చుకుంటే క రాజ్యాలే మారిపోతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకాలను నోచుకోని సంచార జాతులకు కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. గాజులమ్మే పూసలు సహా సంచార జాతులన్నీ ఇంటింటికీ తిరిగి కేసీఆర్ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని వివరించి గద్దె దించాలని కోరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా చీటకోడూరు గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ కు స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు బోనమెత్తి కోలాటాలు ఆడారు. డప్పు వాయిద్యాల నడుమ కళాకారులు డ్యాన్సులు వేస్తూ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చీటకోడూరు గ్రామ పంచాయతీ సమీపంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం సంచార జాతులతో కలిసి రచ్చబండ నిర్వహించిన బండి సంజయ్ ఈ సందర్బంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను పన్నీరు సత్యం పన్నీరు భాను చందర్ ఏకరవు పెట్టారు. తమను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చడం లేదుని, ఏంబీసీ కార్పొరేషన్ నుండి లబ్ది పొందే కులాల జాబితాలో కూడా లేమని వాపోయారు. తమ పిల్లలను చదివించుకునే స్తోమత లేదని, ఉన్నత విద్యను అందించడం అసాధ్యంగా మారిందన్నారు. 200 సంవత్సరాలుగా సంచార జాతులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. బ్రిటీష్ పాలకులు సంచార జాతులను దొంగలుగా చూశారు… ఒక చట్టం చేశారు. ఇప్పటికీ మమ్మల్ని అలానే చూస్తున్నారు. తెలంగాణ వస్తే బాగుపడతామని అనుకున్నాము… మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. తెలంగాణ వచ్చాక, మా బతుకు… పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహకారం అందడం లేదు. సంచార జాతులకు కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి వచ్చే పథకాలకు అర్హత లేకుండా చేశారు. అనాదిగా మేము చంకలో బిడ్డను ఎత్తుకుని, అనేక గ్రామాలు తిరుగుతూ…గాజులు అమ్ముకుంటున్నాం అన్ని ధరలు పెరిగాయి… మేము బతకడమే భారంగా మారింది. మాకు మీరైనా న్యాయం చేయండి. ఆర్ధిక సాయం చేయండి. పని విధానంతో బుట్టలు తయారు చేసే.. మేదరి కులం కూడా ముఖ్యమైనది. ఇప్పుడు బుట్టలు కొనేవారే లేరు. ఎంబీసీ సంచార జాతుల కులాలకు న్యాయం చేయండి’’ అని వేడుకుంటున్నారు. వారి బాధలను విన్న బండి సంజయ్ మాట్లాడుతూ మీ జీవితమంతా ఈ గంప మీద ఆధారపడి ఉంది. సంచారజాతులు చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. నేను కూడా సంచారజాతినే. సంవత్సరం నుంచి మీ కష్టాలను తెలుసుకునేందుకే… సంచారజాతి అవతారం ఎత్తాను. కెసిఆర్ బతుకును కూడా సంచార జాతి ని చేద్దాం. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు ఈ గంప మీద ఆధారపడే జీవిస్తారు. నిజంగా మీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. కులవృత్తులను కేసీఆర్ నిర్వీర్యం చేసాడు. ఎన్నికలు లేవు… ఓట్ల కోసమో రాలేదు. మీ కష్టాలు తెలుసుకునేందుకే వచ్చాం. సంచార జాతులకు అండగా నిలబడతాం. బిజెపి ప్రభుత్వం వచ్చాక, సంచార జాతులకు తప్పకుండా న్యాయం చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లాలోని పూసల సంఘం నాయకులు మహిళలు పాల్గొన్నారు.
