సంపాదనతో సంతోషం రాదు

( ఆధ్యాత్మిక చింతన )
తిరుముల,ఫిబ్రవరి26(జనం సాక్షి): సంతోషంగా ఉండటమనేది మనం ఎంత సంపాదించామనే దానిపై ఆధారపడి ఉండదు. ఎన్ని ఆధునిక పరికరాలు మన వద్ద ఉన్నాయనే దానిపైనా ఉండదు. అవసరాన్ని బట్టి భారమైన విషయాల్ని తేలిగ్గా భావించాలి. జీవితంలో చేసిన తప్పులన్నీ క్షమించేయాలి. స్నేహితులతో,కుటుంబ సభ్యులతో తగవులు మానాలి. మనం మానవ మాత్రులమని గుర్తించాలి. బాధ కలిగించే సంఘటనలు జీవితంలో ఎన్నో జరుగుతాయి. పగలు, ప్రతీకారాలు సంతోషాన్నివ్వవు. పగ అంటే తలపై ఎంతో భారంతో ఒక కొండ పైకి ఎక్కుతున్నట్టే! బరువంతా దింపుకొంటే కొండ ఎక్కడం తేలిక. అవసరాన్ని బట్టి మన డబ్బు, శారీరక శ్రమ, మానసిక శ్రమ, మన సమయాన్ని ఇతరులకివ్వాలి. ఇతరుల విజయం, సంతోషం కోసం పాటుపడాలి. అనాథలకు సేవ చేయడంలో సంతోషం దాగి ఉంటుంది. ’సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి తోడు పడవోయ్‌… అన్న గురజాడ మాటలను చేతల్లో చూపెడితే సంతోషం జాడ తెలుస్తుంది. ఇతరులు సంతోషం కోసం చెట్టు ఫలాలిస్తుంది. ఇతరులు । సంతోషం కోసం ఆవు పాలిస్తుంది. ఇతరుల సంతోషం కోసం నది నీరిస్తూ ప్రవహిస్తుంది. అందుకే, ఇతరులు సంతోషం కోసం కొంతైనా మనిషన్న వాడు కృషిచేయాలి. అప్పుడే మానవ జన్మకు సార్థకత.