సకాలంలో స్కాలర్‌షిప్‌ చెల్లించండి

ఎక్స్‌ వేదికగా కెటిఆర్‌ డిమాండ్‌
హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్ధులంటే.. ఈ కాంగ్రెస్‌ సర్కారుకు ఎందుకింత చిన్నచూపు..? అని కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా? బోధనా ఫీజులు, ఉపకార వేతనాల జాడేది..? రూ. 5900 కోట్లకు బకాయిలు చేరుకున్నా? ప్రభుత్వంలో చలనం లేదు.. దరఖాస్తులకే దిక్కులేదన్నారు. స్కాలర్‌ షిప్పులను పెండిరగ్‌లో పెట్టడంతో.. రోజురోజుకూ విద్యార్థుల అవస్థలు పెరుగుతున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. దీంతో విద్యాసంస్థల యాజమాన్యాలకు తిప్పలు తప్పడం లేదన్నారు. మెయింటెనెన్స్‌ చార్జీలు కూడా రాకపోవడంతో.. వసతిగృహాల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్ల.. పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని కేటీఆర్‌ తెలిపారు. ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆగాలి.. ప్రభుత్వం వెంటనే బకాయిలన్నీ విడుదల చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.