సమష్టిగా పనిచేసి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడుదాం

` టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
హైదరాబాద్‌: తనపై నమ్మకంతో ప్రభుత్వం ఆర్టీసీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించిందని, తన శక్తి మేరకు సంస్థ అభివృద్ధికి పాటుపడతానని ఆర్టీసీ ఛైర్మన్‌ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు.సంస్థ ఉద్యోగులతో పాటు తాను కూడా సమష్టిగా పనిచేసి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. టీఎస్‌ఆర్టీసీ నూతన ఛైర్మన్‌ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ బస్‌భవన్‌లోని తన ఛాంబర్‌లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు.సంస్థను లాభాల బాటలోకి తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేయనున్నట్టు చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా తనను నియమించిన సీఎం కేసీఆర్‌కు ముత్తిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనుభవజ్ఞులైన ఎండీ సజ్జనార్‌ నేతృత్వంలో టీఎస్‌ఆర్టీసీ అన్ని విభాగాల్లో దూసుకుపోతోందన్నారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.