సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి
సిద్దిపేటను అగ్రగామిగా నిలిపేందుకు కృషి
సిద్దిపేట,నవంబరు 26(జనం సాక్షి): రాష్ట్ర మున్సిపల్ శాఖ ఆదేశాలకనుగుణంగా డిసెంబర్ 31లోగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిస్థాయిలో నిషేధం కోసం యత్నిస్తున్నామని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలనిస్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఆయా మున్సిపాలిటీల్లో డిసెంబర్ చివరి నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించాలని నిర్ణయించినట్లు తెలిపారు.ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా మార్చాలన్నారు. సిద్దిపేట మున్సిపల్ అభివృద్ధిలో రోల్ మోడల్గా ఉందన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించాలన్నారు. ఇదే సమయంలో ఆయా మున్సిపాలిటీలు డిసెంబర్ తరువాత ప్లాస్టిక్ను పట్టణంలో నిషేధించినట్లు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధంపై థార్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపించి అవార్డులు ఇస్తామని తెలిపారు. మున్సిపాలిటీల్లో వివిధ రకాల పన్నుల వసూళ్లలో అధికారులు లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలన్నారు. సిద్దిపేట మున్సిపల్లో ప్రస్తుతం 60శాతం వసూల్లు జరిగాయని, నిర్థేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపాలిటీల్లో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) పథకాన్ని నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా దరఖాస్తులను స్వీకరించి క్రమబద్ధీకరణ పక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో తడి, పొడి చెత్త సేకరణ విషయంలో ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగహన కల్పించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత గూర్చి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.


