సీఎం సెకండ్‌ షెడ్యూల్‌

` 13 నుంచి 28 వరకు పర్యటన
` 54 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు
హైదరాబాద్‌ (జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై.. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాజాగా మరో పక్షం రోజులకు సంబంధించిన ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 13 నుంచి 28 వరకు 54 సభల్లో పాల్గొని బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు 30 నియోజకవర్గాల్లో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ నెల 9 నుంచి 12 వరకు పలు నియోజకవర్గాల్లో జరిగే సభలకు హాజరవనున్నారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభ పాల్గొనున్నారు. సీఎం కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ 28న సభతో ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.