సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

*ఎంపీపీ కల్లూరి హరికృష్ణ
శివ్వంపేట జూలై 21 జనంసాక్షి : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన శివ్వంపేట ఎంపీడీవో కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటుగా అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ షుగర్ బీపీ ఉన్న రోగులకు నెలకు సరిపడా మెడికల్ కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. మండలంలో మూడు గ్రామాలకు ఒకటి చొప్పున సబ్ సెంటర్ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మన మండలానికి 10 సబ్ సెంటర్లను మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా సబ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలను మంజూరు చేసిందని హరికృష్ణ చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో తహసిల్దార్ శ్రీనివాస్ చారి, ఎంపీడీవో  నవీన్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటయ్య, విజయ్ కుమార్, సూపర్వైజర్ దిగంబర్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.