హుజూరాబాద్‌ దళితులకు 500కోట్లు

దళితబంధు కింద నిధులు విడుల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): దళితబంధును త్వరగా పట్టాలకెక్కించు పనిలో భాగంగా తొలుత వాసాలమర్రికి దక్కిన అవకావం మలివిడతలో హుజురాబాద్‌ నియోజకవర్గంలోని దళితులకు దక్కింది. ఈ పథకాన్ని ఆరునూరైనా అమలు చేస్తామన్న సిఎం కెసిఆర్‌ తాజాగా వారికి శుభవార్త వినిపించారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు.
ఇప్పటికే వాసాలమర్రి దళితుల కోసం ఈ పథకం కింద రూ. 7.60 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హుజురాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా తెలంగాణ దళిత బంధు పథకం అమలు కానుంది. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాన్ని హుజురాబాద్‌ వేదికగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌లు వరుసగా సవిూక్షలు నిర్వహించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్లేందుకు నిర్ణయించారు.