హెచ్‌సీయూ భూములపై భాజపా ఎంపీతో కలిసి సీఎం కుట్ర

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు
ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్‌ ప్రభుత్వం
400 ఎకరాలు పక్కాగా అటవీ భూములే
దానిపై రుణాలు ఎలా తెచ్చరో చెప్పాలి
దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే.. కేటీఆర్‌ డిమాండ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం అనే 3డీ మంత్రంతో పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రేవంత్‌ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగు తున్నాయని చెప్పారు. కంచ గచ్చిబౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం మొత్తం విస్తుపోయిందన్నారు. ఆ 400 ఎకరాలు అటవీ భూమేనని, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ విషయాన్ని చెబుతున్నానని స్పష్టం చేశారు. హెచ్‌సీయూ భూముల వెనుక 10 వేల కోట్ల ఆర్థిక కుంభకోణం ఉందన్నారు. కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అంటూ ఆరోపించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డికి అన్నీ తెలిసే భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ఒక బీజేపీ ఎంపీ సహకారంతో ఈ స్కామ్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ట్రస్ట్‌ ఎడ్వజైర్స్‌ ఇన్వెస్ట్మెంట్‌ అనే కంపెనీ రేవంత్‌ రెడ్డికి బ్రోకరిజం చేసిందన్నారు. అందుకు గాను .. సదరు కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చారన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్బీఐ గైడ్‌లైన్సులను తుంగలో తొక్కారని చెప్పారు. అటవీ భూమిని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. అటవీ భూమిని తాకట్టు పెట్టడం, అమ్మే అధికారం ప్రభుత్వానికి కూడా లేదన్నారు. వాల్టా, ఫారెస్టు చట్టాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉల్లంఘించింది. బీజేపీ ఎంపీ సారధ్యంలోనే బ్రోకరేట్‌ కంపెనీ తీసుకొచ్చారు. ఆ ఎంపీకి రేవంత్‌ అనుచుతి లబ్ధి చేకూరుస్తున్నారు. త్వరలోనే ఆ బీజేపీ ఎంపీ ఎవరో చెబుతానన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తున్నట్లు వెల్లడిరచారు. కేంద్రం, ఆర్బీఐ, సీబీఐ, సెబీ, ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు చేయాలని కోరుతున్నాం. 400 ఎకరాలకు టీ-జీఐఐసీకి యజమాని కాదు. తమది కాని భూమిని టీ-జీఐఐసీ తాకట్టు- పెట్టింది. మోసపూరిత భూమిని తాకట్టు పెట్టుకుని బ్యాంకు రుణం ఇచ్చింది. 400 ఎకరాల భూమి విలువ రూ.5,239 కోట్లు- అని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్టేష్ర్రన్స్‌ శాఖ చెబుతున్నది. అదే భూమి విలువ రూ.30 వేల కోట్లు- అని రెవెన్యూ శాఖ చెప్పింది. లేని భూమి ఉన్నట్లు చూపి లోన్‌ తీసుకోవాలని చూశారు. భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్‌ రెడ్డి పాల్పడుతున్నారు. తమది కాని భూమిని టీ-జీఐఐసీ ఎలా తాకట్టు పెడ్తుందని కెటిఆర్‌ ప్రశ్నించారు. ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థికమంత్రికి తెలియకుండా ఈ వ్యవహారం జరిగిందన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటేనే సీవీసీ, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం స్పందించకుంటే కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఒప్పందం ఉన్నట్లే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా.. 10వేల కోట్లు తెచ్చారన్నారు. లిటిగేషన్‌ భూమికి ఐసీఐసీఐ బ్యాంకు ఎలా లోన్‌ ఇచ్చిందని ప్రశ్నించారు. ఫీల్డ్‌ విజిట్‌ చేయకుండానే బ్రోకర్‌ ఆధారంగా బ్యాంక్‌ ప్రభుత్వానికి రుణం ఇచ్చిందని కేటీఆర్‌ పేర్కొన్నారు.