హైకోర్టు తీర్పుతో కార్మికులకు కన్నీళ్లు
దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులకు మందకృష్ణ మద్దతు
సిద్దిపేట,నవంబర్19 (జనంసాక్షి) : హైకోర్టు తీర్పు చూసి ఎంతో మంది ఆర్టీసీ కార్మికులకు కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేసి విరమించిన రోజు కూడా అదే జరిగిందన్నారు. కానీ దీక్ష విరమించిన వెంటనే తెలంగాణ రాలేదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ మాదిరిగానే కార్మికులు ఏ లక్ష్యంతో సమ్మె మొదలు పెట్టారో నూటికి నూరు శాతం ఆ లక్ష్యాన్ని సాధిస్తారని కార్మికుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 46 రోజులకు చేరిన సందర్భంగా దుబ్బాక బస్సు డిపో వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. గతంలో పరిపాలించిన కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కంటే వెయ్యి రేట్లు నయమన్నారు. బీజేపీ లీడర్ రఘునందన్ రావుతో కలిసి కార్మికులకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు ప్రజలను తక్కువ చేసి మాట్లాడితే ప్రభుత్వాన్ని గ్దదె దింపే సత్తా ప్రజలకుందన్నారు.కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనుల నిలబెట్టిన ఘనత ఆర్టీసీ కార్మికులకే దక్కిందన్నారు మందకృష్ణ. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకు కార్మికులు అడ్డుపడు తున్నందునే సెల్ఫ్ డిస్మిస్ అంటున్నారని విమర్శించారు.తప్పకుండా కార్మికులు విజయం సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకునేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకున్నారని, ఆర్టీసీ ఆస్తులను కూడా అమ్మేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అన్నారని అన్నారు. ఏపీలో ఆర్టీసీని విలీనం చేసి తనకు లేనిపోని చిక్కు పెట్టాడని ఆ రాష్ట్ర సీఎం జగన్పైనా సీఎం కేసీఆర్కు కోపం ఉందన్నారు. ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుందని, అడ్డుకునే వారే ఓడిపోతారని పేర్కొన్నారు. గెలుపు ఎప్పుడనేది చెప్పలేము కానీ గెలుపు మాత్రం పక్కా అన్నారు. సమ్మె మొదలైన మొదటి వారంలోనే కార్మికులపై తీవ్ర కుట్రలు చేశారని అన్నారు. కార్మికులపై వ్యతిరేకత రావాలని పండుగల ముందు కార్మికులు సమ్మె చేశారని ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేశారంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కార్మికులను ఒంటరి చేసి కాల్పులు జరిపే ప్రయత్నం కూడా చేశారని, అయితే విషయం ముందే లీక్ కావడంతో ఈ నిర్ణయాన్ని విరమించారంటూ మందకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్తో పోలిస్తే సమైక్యాంధ్ర నాయకులు వందశాతం నయం అన్నారు. వేల పుస్తకాలు చదివానని కేసీఆర్ చెప్తుండేవారని ఉటంకించిన మందకృష్ణ.. ఆయన చదివింది మంచి పుస్తకాలు కాదని, దుర్మార్గం పుస్తకాలు చదివారని వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే కేసీఆర్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని, కార్మికులను చెరో మెట్టు దిగాలని హైకోర్టు చెప్పింది గానీ.. కార్మికులు మెట్టు దిగాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీకి ఉందని, కార్మికులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.



