హైదరాబాద్లో లక్ష్మీపేట బాధితుల ధర్నా
హైదరాబాద్: తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లక్ష్మీపేట బాధితులు దళిత సంఘాల నేతలతో కలిసి ఈరోజు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాలో మృతుల కుటుంబాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి దళితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని, 250ఎకరాల భూమిని దళితులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు 10లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ దాడులతో సంబంధం ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణను శిక్షించాలని కోరారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఆగష్టు 20వ తేదీన ఛలో ఢిల్లీ పేరుతో వేలాదిమంది దళితులు ఢిల్లీకి తరలివెళ్లనున్నట్లు నేతలు ప్రకటించారు.