జిల్లాలో ఆవిర్భావ వేడుకలకు రంగం సిద్దం

ఖమ్మం,మే29(జ‌నం సాక్షి): రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మూడ్రోజుల పాటు పండుగాలా నిర్వహించాలని కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదట అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మూడు రోజులు ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖ వ్యక్తులను సత్కరించాల్సి ఉన్నందున జాబితాను శాఖలు త్వరగా అందించాలన్నారు. 2న జిల్లా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకు ఘనంగా వేడుకలను నిర్వహించాలన్నారు. అమరవీరుల స్థూపాలను అందంగా అలంకరించాలన్నారు. తొలుత అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాతే మిగతా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు.  పదో తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించాలన్నారు.