వలసల గడ్డపై ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల: మంత్రి కేటీఆర్‌

దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ మరికొన్ని గంటల్లో సాకారం కానుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని (PRLIS) ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు ప్రాజెక్టు గురించి మంత్రి కేటీఆర్‌ (Minister KTR) భావోద్వేగంగా ట్వీట్‌ చేశారు. తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ, పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాలనురగల జలహేల, వలసల వలపోతల గడ్డపైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం కానుందన్నారు. కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో కృష్ణమ్మ జల తాండవం చేయనుందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు.