హిందుత్వ ఆధారంగా బీజేపీకి మద్దతు: ఉద్దవ్‌ థాకరే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని అభ్యర్థిగా గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికే తన మద్దతని శివసేన నేత ఉద్దవ్‌ థాకరే ప్రకటించారు. మోడి అభ్యర్థిగా తాను ఇంతవరకు వ్యతిరేకించలేదని చెప్పారు. తమ తండ్రి బాలథాకరే సుష్మాస్వరాజ్‌ ప్రధానిని చేయాలన్నది వాస్తవమేనన్నారు. అప్పుడు నరేంద్రమోడి పేరే ప్రధాని రేసులో లేదని గుర్తు చేశారు.
ఇక జేడి(యూ) అధినేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఎన్డీఎ నుంచి వైదొలగడం తొందరపాటు చర్య అన్నారు. బీజేపీతో తమ ఒప్పందం హిందుత్వం మీదనే జరిగిందని చెప్పారు. విదర్భ విషయంలో తమ వైఖరి స్పష్టం అన్నారు. మహారాష్ట్రను ఎప్పటికీ ముక్కలు కానివ్వం అని చెప్పారు. కాంగ్రెస్‌లో ఒక్కరు కూడా నమ్మకమైన నాయకులు లేరన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని, మోడితో పోల్చడం కంటే ప్రజలకు పెద్ద సమస్యలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు.