అందరం కష్టపడి పనిచేయాలి :మహానాడులో బాబు పిలుపు
కష్టకాలంలో అందరం కష్టపడి పనిచేయాలి, క్లిష్టపరిస్థితులను అద్భుతమైన అవకాశంగా మార్చుకుందాం: మహానాడులో బాబు పిలుపు

హైదరాబాద్, మే 27: కష్టకాలంలో కష్టపడి పనిచేయాలి, ప్రతికూల పరిస్థితులను ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా మార్చుకోవాలి అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధించిన విజయాలు ఫలితాలనిచ్చే దశలో అధికారం చేజారిందని, అదే ఊపులో అభివృద్ధి కొనసాగితే పదేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ ఎంతో ముందంజలో ఉండేదని, కాని ఈ ఈ పది సంవత్సరాల (యుపిఏ) పాలనలో మనం 20 ఏళ్లు వెనక్కుపోయాం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గండిపేటలో మంగళవారం ఉదయం ప్రారంభమైన మహానాడును ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరూ నిర్మొహమాటంగా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని, తమ తమ ఆలోచనలను పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇతర పార్టీలకు, తెలుగుదేశం పార్టీకీ తేడా ఉంటుందని చెబుతూ కాంగ్రెస్ ఎంత లూటీ చేసినా ప్రజలు పట్టించుకోరని, కాని తెలుగుదేశం తరపున పనిచేస్తున్న వ్యక్తులు ఏ చిన్న తప్పులు చేసినా దాన్ని అందరూ గమనిస్తారని ఆయన వివరించారు.
ప్రస్తుతం సీమాంధ్రలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, అలాగే తెలంగాణాలో సామాజిక న్యాయాన్ని సాధించవలసిన అవసరం ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఈ 32 ఏళ్లలో అనేక దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి, మనం జాతీయ పార్టీగా మారుతున్నాం అంటూ ప్రతి ఒక్కరం మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు.
ప్రజలు మన మీద ఆశలు పెట్టుకున్నారు, రాష్ట్ర సమస్యల పరిష్కారంకోసం మనం రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలోకి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. సంక్షోభాలను మనం ఒక అద్భుత అవకాశంగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను తీర్చుదిద్దుదాం, యువతకు మంచి భవితను ఇద్దాం, ఇదే ఇప్పుడు మన అందరి తక్షణ కర్తవ్యం అని చంద్రబాబు దిశానిర్దేశనం చేశారు.