జనంసాక్షి’ ఎడిటర్ రహమాన్ పై కేసు అప్రజాస్వామికం: టీడబ్ల్యూజేఎఫ్

ఖమ్మం (జనంసాక్షి) : జనం సాక్షి పత్రిక ఎడిటర్ ముజీబుర్ రెహమాన్ పై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికమని టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యతిరేక వార్తలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలి తప్ప అక్రమంగా కేసులు నమోదు చేయటం సరికాదని టీడబ్ల్యూజేఎఫ్ సూచించింది. పెద్ద ధన్వాడ లో ఇథనాలు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ప్రత్యక్షంగా రెహమాన్ ఘటనాస్థలిలో లేకపోయినా… ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజోలి పోలీసులు కేసు నమోదు చేయడం కక్ష సాధింపేనని పేర్కొంది. ఇది ముమ్మాటికి పత్రిక స్వేచ్ఛపై దాడి చేయడమే అని తెలిపింది. ప్రజల నిరసన, వ్యతిరేకతను జనంసాక్షి కళ్లకు కట్టినట్లు ప్రచురించడంతోనే ఫ్యాక్టరీ యాజమాన్యం తట్టుకోలేకపోతుందని ఆరోపించింది. ఇటువంటి కక్ష సాధింపు చర్యలను టిడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొంది.

తాజావార్తలు