| గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీ విడుదల..

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు ప్రాథమిక కీ కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే జూన్ 17 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు.

ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల‌ను 13వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. దీనికోసం మొదట కమిషన్ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్ ద్వారా వ్యక్తిగత వివరాలను ధ్రువీకరించాలి. ఆ తర్వాత అభ్యంత‌రాల‌ను ఆంగ్లంలో నమోదు చేయాలి. వాటికి తగిన రుజువులు, పుస్తక రచయిత పేరు, పుస్తకంలో పేజీ నంబరు, పత్రిక ఎడిషన్, పేజీ నంబరు, పబ్లిషర్ పేరు.. వెబ్‌సైట్‌ యూ‌ఆర్‌ఎల్ వివరాలను ఇవ్వాలి. ఈ-మెయిల్, వ్యక్తిగత అభ్యర్థనలు, ఇతర పద్ధతుల్లో వచ్చే, గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంత‌రాల‌ను పరిగణనలోకి తీసుకోబోమని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.

మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అయితే వీరిలో 3.02 లక్షల (74 శాతం) అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే దాదాపు లక్ష మంది పరీక్షకు హాజరు కాలేదు. ఇక కమిషన్ బుధవారం మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు ఉంటాయని తెలిపింది.