అక్షయ్‌పై సిట్‌ ప్రశ్నల వర్షం


– సుఖ్భీర్‌ బాదల్‌ను ఎందుకు కలిశారంటూ ప్రశ్న
న్యూఢిల్లీ, నవంబర్‌21(జ‌నంసాక్షి) : పంజాబ్‌లోని భర్గారి గ్రామంలో జరిగిన మతపరమైన ఘర్షనల కేసులో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిట్‌ అధికారులు అక్షయ్‌ కుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. 2015లో పంజాబ్‌లోని ఫరీద్‌ కోట్‌ జిల్లాలో బుజ్‌ జవహర్‌ సింగ్‌ వాలా, భర్గారి గ్రామాల్లో కొన్ని అపవిత్ర సంఘటనలు జరిగాయి. దీంతో సిక్కు మద్దతుదారుల ఆందోళనలు చేపట్టారు. ఈ అల్లర్లలో 60 మంది వరకు చనిపోయారు. ఈ కేసులతో అక్షయ్‌ కుమార్‌తో పాటు పంజాబ్‌ మాజీ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, ఆయన కుమారుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌, అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తోన్న డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌కు సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే డేరా బాబా జైలులో ఉండటంతో మిగిలిన ముగ్గురికీ ఈనెల ప్రారంభంలో వీరి ముగ్గురికీ సిట్‌ సమన్లు పంపింది. విచారణకు తమ
ముందు హాజరు కావాలని ఆదేశించింది. భర్గారి అపవిత్రం కేసు, బేబాల్‌ కలన్‌, కొట్కాపుర పోలీస్‌ ఫైరింగ్‌ ఘటనల్లో వీరి ముగ్గురినీ బాధ్యులను చేస్తూ సిఆర్‌పీఎస్‌లోని సెక్షన్‌ 160 కింద సమన్లు పంపారు. ఈ ఘటనపై వేసిన జస్టిస్‌ రంజిత్‌ సింగ్‌ కమిషన్‌ నివేదిక ద్వారా అక్షయ్‌ కుమార్‌ పేరు బయటికి వచ్చింది. ముంబైలోని అతని ఫ్లాట్‌లో డేరా సచ్ఛ సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌కు, సుఖ్బీర్‌కు మధ్య అక్షయ్‌ విూటింగ్‌ ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. డేరా బాబా సినిమాను పంజాబ్‌లో విడుదల చేయడం కోసం 2015 సెప్టెంబర్‌ 20న ఈ విూటింగ్‌ జరిగిందని, అక్షయ్‌ మధ్యవర్తిగా వ్యవహరించారని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను ఇప్పటికే అక్షయ్‌ ఖండించారు. తానెప్పుడూ డేరాబాబాను కలవలేదని స్పష్టం చేశారు. కానీ, పోలీసులు మాత్రం డేరా బాబాను అక్షయ్‌ నిజంగా కలిసారా? లేదా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఒక ఆధారం దొరికింది. అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా అప్పట్లో డేరా బాబాపై ఒక ట్వీట్‌ చేశారు. గుర్మీత్‌ రామ్‌ రహీం జుహులో నివసిస్తున్నారని ఆ ట్వీట్‌లో ట్వింకిల్‌ పేర్కొన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని అక్షయ్‌ను బుధవారం సిట్‌ అధికారులు ప్రశ్నించారు. అలాగే సుఖ్భీర్‌ బాదల్‌ను ఎందుకు కలిశారని కూడా సిట్‌ అక్షయ్‌ను ప్రశ్నించింది. ఛండీగఢ్‌లో జరిగిన ఈ విచారణలో అక్షయ్‌ను సిట్‌ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్లు తెలుస్తోంది.