అత్యాచారాలకు వెరవని మృగాళ్లు


నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం
ముంబయి,ఆగస్ట్‌27 (జనం సాక్షి):  కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భార్రతికి గురిచేసింది. లైంగిక దాడులను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మహిళలపై అరాచకాలు ఆగట్లేదు. తాజాగా మహారాష్ట్రలో మరో ఘటన చోటుచేసుకుంది. నర్సింగ్‌ విద్యార్థినిపై ఓ ఆటోడ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్రలోని రత్నగిరిలో నర్సింగ్‌ విద్యార్థిని(20) తరగతులకు హాజరైన అనంతరం ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఆమెతో మాటలు కలిపిన డ్రైవర్‌ తాగడానికి నీళ్లు ఇచ్చాడు. అప్పటికే అందులో అతడు మత్తుమందు కలపడంతో యువతి స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో, అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కొంత సేపటికి స్పృహ రావడంతో తనపై లైంగిక దాడి జరిగినట్లుగా గుర్తించిన బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితుడిని త్వరగా అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాధితురాలి బంధువులు, స్థానికులు, డాక్టర్లు, నర్సులు అర్ధరాత్రి రోడ్డుపై పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఇటీవల కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలని వైద్యులు, నర్సులు ఆందోళన చేపడుతున్నారు. ఈ తరుణంలో మరో విద్యార్థినిపై లైంగిక దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది.