అధికార టిఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కసరత్తు

సోనియా సభతో ముందుకు వెళ్లాలని నిర్ణయం

15 రోజుల్లో సుడిగాలి పర్యటనలు

హైదరాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ.. అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. భారీగా సోనియా, రాహుల్‌ సభలను నిర్వహించడంతో పాటు ప్రచరాంలో కూడా జోష్‌ పెంచుతోంది. మరో పదిహేను రోజులే ప్రచార సమయం ఉండడంతో ఉత్తమ్‌ టీమ్‌ ఎవరికి వారు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అందుకే పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నామినేషన్ల పక్రియ ముగియడంతో ప్రచారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. జాతీయ, రాష్ట్రస్థాయి నేతలతో పాటుగా ఛరిష్మా ఉన్న నేతలతో ప్రచారం చేయించాలని భావిస్తోంది. 23న మేడ్చెల్‌లో సోనియా సభతో కొంత ఊపురానుందని భావిస్తున్నారు. ఈ మేరకు సభను సక్సెస్‌ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికలకు కేవలం 15 రోజులే సమయం ఉన్నందువల్ల ప్రచారంలో దూకుడు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటోంది. జిల్లాల్లోని అన్ని స్థానాల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌.. ప్రచారంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఉండాలని అభ్యర్థులకు సూచిస్తోంది. ఈనెల 28న వికారాబాద్‌, తాండూరులో సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ స్థాయిల్లోనే బహిరంగ సభలను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఎక్కువమందిని తరలించడంతోపాటు నాయ కులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈనెల 23నుంచి రాష్ట్రంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సభలను ఏర్పాటుచేయాలని పార్టీ నిర్ణయించింది.జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాల కేంద్రాల్లో 28న

బహిరంగసభలను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించింది. 28న నిర్వహించే సభల్లో సోనియాగాంధీ పాల్గొంటారా.. లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. వచ్చే నెల 2 నుంచి రెండు, మూడు రోజులపాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనేపథ్యంలో ఆయన కొడంగల్‌, పరిగిలో సభలను ఏర్పాటు చేసేందుకు నేతలు చర్యలు తీసుకుంటున్నారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్‌లో నిర్వహించే సభలో రాహుల్‌గాంధీ పాల్గొనే అవకాశం మెండుగా ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రేవంత్‌ రెడ్డి కూడా తన సొంత నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ప్రచారం పక్రియ వచ్చే నెల 5న ముగిసేవరకు నిత్యం కొనసాగనుంది. కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌, సినీనటి విజయశాంతి వివిధ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితర ముఖ్యులు ప్రచారంలో పాల్గొనని నియోజకవర్గాల్లో విజయశాంతి ప్రచారం చేసే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా మరికొంతమంది స్టార్‌డమ్‌ ఉన్న నేతలు, సినీ, సామాజిక రంగాల ప్రముఖులతో ప్రచారం నిర్వహించేలా పార్టీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు.