అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం

కారు,బస్సు ఢీకొని ఇద్దరు మృతి
అనంతపురం,మార్చి11(జ‌నంసాక్షి):  అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం దంపెట్ల వద్ద అనంతపురం- చెన్నై జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాల య్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కదిరి నుంచి అనంతపురం వైపు వెళుతోంది. మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన పాల్‌ ప్రమోద్‌ సునీల్‌(24) కొందరు యువకులతో కలిసి కారులో ఎదురుగా వస్తున్నారు. ఈ క్రమంలో దంపెట్ల వద్ద బస్సు, కారు ఢీకొనడంతో కారులో ఉన్న సునీల్‌, మరో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను, క్షతగాత్రులను 108లో బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.