అన్నదాతలకు బేడీలు వేస్తారా?
` రైతుకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సీరియస్
` ముగ్గురుపోలీసులను సస్పెండ్ చేశాం
` ఎస్పీ వివరణ
హైదరాబాద్(జనంసాక్షి):జోగులాంబ గద్వాల్ జిల్లాలో రైతులకు బేడీలు వేయడంపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు రైతు కమిషన్ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి ఫోన్ చేసి సీరియస్ అయ్యారు. ఇదేం పద్ధతని ప్రశ్నించారు. బేడీలు వేసిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు కోదండరెడ్డికి ఎస్పీ వివరణ ఇచ్చారు. ఈ సంఘటన విషయంలో మనస్తాపానికి గురైనట్లు రైతు కమిషన్ ఛైర్మన్ పేర్కొన్నారు. జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చే సమయంలో రైతులకు పోలీసులు బేడీలు వేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.