అన్నా డిఎంకె కార్యాలయంలో జయ కొత్త విగ్రహం

ఆవిష్కరించిన సిఎం పళనిస్వామి

చెన్నై,నవంబర్‌14(జ‌నంసాక్షి): తమిళనాడు మాజీ సీఎం జయలలిత కొత్త కాంస్య విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయంలో సీఎం పళనిస్వామి ఈ కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2016 డిసెంబర్‌లో జయ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జయ కాంస్య విగ్రహాన్ని పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహం జయ ఆకారంలో లేదని పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. జయ అభిమానులు కూడా ఆ విగ్రహం సరిగా లేదని ఆరోపణలు చేశారు. విగ్రహంలోని ముఖకవళికలు జయలలితలా లేవని నిరుత్సాహపడ్డారు. దీంతో పళని ప్రభుత్వం మళ్లీ కొత్త కాంస్య విగ్రహాన్ని చేయించింది. మెడలో గులాబీ మాలతో పాటు రెండు ఆకుల గుర్తు చూపిస్తు నిలుచున్న జయ విగ్రహాన్ని మళ్లీ సీఎం పళని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం కూడా పాల్గొన్నారు. మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్‌ పక్కనే.. జయ భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.