అయోధ్యలో భారీ బందోబస్తు : 24 గంటల కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

లక్నో,నవంబర్‌8 (జనంసాక్షి) : అయోధ్యలోని రామ జన్మభూమి ఉ బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు ఈ నెల 17వ తేదీలోగా తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధమయింది. అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
అయోధ్యలో  హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. లక్నోలో కూడా హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురువారం నాడు జిల్లా మెజిస్టేట్స్‌త్రో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలని ప్రయత్నించే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. 24 గంటలపాటు పని చేసే మాస్టర్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎస్‌పిలు, జిల్లా మెజిస్టేట్లు అన్ని మతాలకు చెందిన నాయకులను కలుస్తుండాలని ఆయన అన్నారు. పెట్రోలింగ్‌ను పెంచాలని, శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు.