ఆక్వా చెరువులతో పర్యావరణ విధ్వంసం

కాకినాడ,జనవరి28(జ‌నంసాక్షి): అనధికారికంగా వందల సంఖ్యలో ఆక్వా చెరువులకు అధికారులు అనుమతులు ఇచ్చేశారని దీంతో పర్యావరణసమస్యలు తలెత్తుతున్నాయని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అన్నారు. వీటి వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. అక్రమ ఆక్వా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళనలను మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆక్వా చెరువు 5 నుంచి 10 హెక్టార్ల పరిధిలో మాత్రమే ఉండాలన్నారు. కాని చాలా చెరువులు 100 హెక్టార్లలో ఉన్నాయన్నారు. ఈ చెరువుల వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. దీని వల్ల తాగునీటి కొరత ఏర్పడుతుందన్నారు. అంతే కాకుండా ప్రజలు నానా వ్యాధులబారిన పడుతున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్టు వ్యవహారించడం శోచనీయమన్నారు. పంట పొలాలు, ఆవాశాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఆక్వా చెరువుల వల్ల హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ ఆక్వా సాగు జరుగుతున్న కోమనపల్లి, గేదెల్లంక, ఠానేలంక, క్రాప చింతలపూడి, సిహెచ్‌.గున్నేపల్లి, ముమ్మిడివరం, అయినాపురం, కొత్తలంకల్లో అక్రమ ఆక్వా చెరువుల వల్ల పొలాలలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. పంటపాలాలు, ఆవాసాల మధ్య ఆక్వా చెరువులకు అనుమతులు ఇవ్వరాదన్నారు. వీటి పరిష్కారానికి గ్రామస్తులు ఐక్యంగా పోరాటానికి సిద్ధమవ్వాలన్నారు.