ఆక్వా చెరువులతో పెరుగుతున్న కాలుష్యం

భూగర్బ జలాలు కలుషితం

ఏలూరు,జనవరి25(జ‌నంసాక్షి): జనాభా పెరుగుదలకు అనుగుణంగా వ్యవసాయరంగ అభివృద్ధి లేదని సర్వే గణాంకాలు తెలుపుతున్నాయి. అందుకు భిన్నంగా అధికార పార్టీ నాయకులే లంచాలు తీసుకుని పొలాలను నాశనం చేసి చెరువులును అధికారుల చేత అనుమతులు ఇప్పించేస్తూ ఆక్రమార్జనకు పాల్పడుతున్నారు. దీంతో పచ్చటి పశ్చిమ కాలుష్యకారకంగా మారుతుందని స్థానికులు విమర్శించారు. ప్రజలందరికీ అన్నం పెట్టే పచ్చనిపొలాలను నాశనం చేసి చేపలు చెరువులు తవ్వితే సహించేది లేదని దొంతవరం గ్రామస్తులు హెచ్చరించారు. ఆ గ్రామంలో ఎస్‌సి కాలనీని ఆనుకొని ఉన్న పచ్చటి వరి పొలాలను చేపలు, రొయ్యల సాగు కోసం చెరువు తవ్వకాలకు అధికారులు అనుమతులిచ్చారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎపి రైతు సంఘం జిల్లా నాయకులు హెచ్చరించారు. చెరువులు తవ్వకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ విూకోసంలో కలెక్టర్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్థానిక ప్రజల అభిప్రాయాలను రైతు సంఘం, సిఐటీయూ నాయకులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మండలంలో రాచూరు, దొంతవరం, సీతారామపురం, విఎ.పురం, అప్పారావుపేట తదితరగ్రామాలు ఆక్వా కాలుష్యంతో తాగునీరు దొరకని పరిస్థిలు దాపురించాయని, భవిష్యత్తు తరాలకు కాలుష్యరహిత జలాలను ఇవ్వాలంటే చెరువులు తవ్వకుండా కఠిన నిబంధనలను విధించాలని కోరారు. తమ కాలనీని ఆనుకున్న పొలాలను చెరువులుగా తవ్వితే ప్రాణత్యాగం చేసైనా అడ్డుకుంటామని వారు అన్నారు. వ్యవసాయానికి అప్పులు దొరక్కకౌలురైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో కౌలుసాగు సంక్షోభంలో పడిందని ఆంధప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. రబీకి కౌలురైతులకు వడ్డీలేని పంట రుణాలివ్వాలని డిమాండ్‌ చేశారు. భూఅధీకృత సాగుదారు చట్టం ప్రకారం ఇచ్చిన రుణార్హత కార్డులకు పంట రుణాలివ్వకుండా బ్యాంకర్లు వాటిని రుణ అనర్హత కార్డులుగా మార్చివేస్తున్నారని విమర్మించారు. కౌలురైతులకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నోట్ల రద్దుతో గ్రామాల్లో ప్రయివేటు అప్పులు దొరకడం లేదన్నారు. చట్టప్రకారం కౌలురైతులకు పంట రుణాలందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో బ్యాంకుల ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. డెల్టా ప్రాంతంలో అక్రమంగా తవ్వతున్న చేపలు, రొయ్యల చెరువులను అరికట్టాలని, వరి సాగయ్యే భూములను కాపాడాలని కోరారు.