ఆగివున్న లారీని ఢీకొన్న కారు

ఇద్దరు మృతి..మరో ఇద్దరికి గాయాలు

డ్రైవర్‌ అతివేగమే కారణమని ఆరోపణ

సూర్యాపేట,జూన్‌4(జ‌నం సాక్షి): కోదాడ బైపాస్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనక నుంచి వచ్చిన కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్‌-విజయవాడ హైవే 65పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి సత్యనారాయణ, ఆయన భార్య మాధురి, మరదలు సౌజన్యతో పాటు డ్రైవర్‌ రావులపాలెం బయల్దేరారు. అయితే వేగంగా వెలుతున్న డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్దాంతం గ్రామానికి చెందిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగి అరిమెల్లి వెంకట సత్యనారాయణ కుటుంబంతో కలిసి స్వస్థలానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సత్యనారాయణతో పాటు గుల్లపల్లి వెంకట మాధవి మృతిచెందారు. గర్భిణి అయిన వెంకట సత్యనారాయణ భార్య వెంకటసౌజన్యకు, సంస్థాన్‌ నారాయణపురానికి చెందిన డ్రైవర్‌ రాజేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్యం కోసం విజయవాడకు తరలించారు. వీరిని కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.