ఆయుధగోదామ్లో ఘోర ప్రమాదం
ఆరుగురు దుర్మణం..క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు
ముంబయి,నవంబర్20(జనంసాక్షి): మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సైన్యానికి చెందిన ఆయుధ గోదాంలో పేలుడు జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రక్షణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..వార్దా జిల్లాలోని పుల్గావ్లో గల ఆర్మీ ఆయుధ గోదాంలో గడువుతీరిన మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలుళ్లు
చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు సహా ఆరుగురు మృతిచెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సవిూపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పుల్గావ్ ఆయుధ గోదాంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2016 మే నెలలో ఈ గోదాంలోనే భారీ అగ్నిప్రమాదం జరిగి 16 మంది రక్షణశాఖ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పుల్గావ్ గోదాం దేశంలో సైన్యానికి చెందిన అతిపెద్ద ఆయుధ గోదాం. బాంబులు, గ్రనైడ్లు, తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలతోపాటు దేశంలోని పలు ఫ్యాక్టరీల్లో తయారు చేసిన ఆయుధాలను ఇక్కడకు తీసుకొచ్చి భద్రపరుస్తారు. అక్కడి నుంచి ఫార్వర్డ్ బేస్లకు తరలిస్తుంటారు.